Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం రాసిన కంచె ఐలయ్య తీరుపై చర్చించేందుకు హైదరాబాద్ లో ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన పలువురు కంచె ఐలయ్యపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాజంలో కులాల మధ్చ చిచ్చుపెట్టే ఐలయ్య లాంటివారు దేశద్రోహులతో సమానమని, మాజీ మంత్రి , టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మండిపడ్డారు. ఇలాంటి రాతలు రాసేవారిని అరబిక్ దేశాల్లో నడిరోడ్డుమీదే శిక్షిస్తారని, మనదేశంలోనూ ఇలాంటివారిని అందరిముందు ఉరితీసేలా చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఐలయ్య రాతలను సమర్థిస్తున్నవారిని ఆయన మతిభ్రమించిన నేతలుగా అభివర్ణించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సినీనటి కవిత కూడా ఐలయ్య పై తీవ్ర విమర్శలుచేశారు. కంచ ఐలయ్య డేరా బాబా కంటే పెద్ద ద్రోహని, ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ఆర్యవైశ్యులను అవమాన పర్చిన ఐలయ్యకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు. మరోవైపు ఎన్ని విమర్శలు వచ్చినా…కంచ ఐలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం లేదు. తన పుస్తకాన్ని ఆయన గట్టిగా సమర్థించుకుంటున్నారు.
వరంగల్ లో ఆఫీసర్స్ ఫోరం ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఐలయ్య తాను రాసిన చిన్నపుస్తకంపై ఇంతగా విమర్శలు చేయడం తగదన్నారు. తమ జాతిని అవమానించారని కోమట్లు అంటున్నారని, మరి బ్రాహ్మణులు తాము రాసిన పుస్తకాల్లో కింది కులాల వారిని చండాలరు, శూద్రులు, దుర్మార్గులు, జ్ఞానం లేని వారు అని ఎన్నో రకాలుగా తిట్టారని, మరి వారి సంగతేమిటని ఐలయ్య ప్రశ్నించారు. చాకలోడు, మంగళోడు, దళితుడు అని తిట్టిన అగ్రకులాల అహంకారం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన మండిపడ్డారు. కింది కులాల వారిని అవమానించబోమని, తిట్టబోమని, అగ్రకులాల వారు చెప్పి… తన డిమాండ్లను ఒప్పుకుంటే తాను రాసిన పుస్తకాన్ని హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగంగా తానే తగలబెడతానని ఐలయ్య సవాల్ విసిరారు.