Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పోలవరం పనులు ఇంకా స్పీడ్ గా జరగడానికి కాంట్రాక్టర్ ని మారుద్దామని సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు గండి కొట్టిన కేంద్రం మనసు మారేలా వుంది. బాబు ప్రతిపాదన చూడగానే అసలు కాపర్ డాం అవసరం లేని కొత్త ప్లాన్ అంటూ పోలవరం పనులకు బ్రేక్ వేసేందుకు పావులు కదిపిన కొందరు బీజేపీ నేతలకి షాక్ తగిలేలా వుంది. ఒకవేళ కేంద్రం కాదంటే రాష్ట్ర బడ్జెట్ తో అయినా పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన రాగానే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదే జరిగితే ఇప్పటికే హోదా ఎగ్గొట్టారని మండిపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి వెళ్లే ఒకే ఒక్క అవకాశం కూడా ఉండదని బీజేపీ వ్యూహకర్తలకు అర్ధం అయిపోయింది.
ఢిల్లీలో అపాయింట్ మెంట్ కష్టం అని సీఎం చంద్రబాబు నేరుగా నాగపూర్ వెళ్లి మరీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి ప్రస్తుతం పోలవరం కాంట్రాక్టు చేస్తున్న సంస్థ ట్రాన్స్ ట్రాయ్ ని మార్చితే పనులు చురుగ్గా సాగుతాయని చెప్పేందుకు ప్రయత్నించారు. దానికి చూద్దాం అన్న సమాధానంతో ఆయన సరిపెట్టారు. తర్వాత సాంకేతిక, ఇతరత్రా కారణాలు చూపి పనులు ఆపడానికి కేంద్ర జలవనరుల శాఖ ట్రై చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో అయినా పోలవరం కట్టిస్తామని చంద్రబాబు ముందుకు వచ్చారు. దీంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి బాబు అన్నంత పనిచేస్తే తమకు పుట్టగతులు ఉండవని అధిష్టానానికి మొర పెట్టుకున్నారు. విషయం అర్ధం చేసుకున్న కమలనాధులు ఆ డామేజ్ పూడ్చుకోడానికి అన్నట్టు ట్రాన్స్ ట్రాయ్ తో సంబంధాలున్న ఎంపీ రాయపాటిని పిలిచి కాంట్రాక్టు మార్పు గురించి ప్రస్తావిచారు. ఆయన కూడా ఓకే అనడంతో దాదాపుగా అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. ఆపై రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేయడానికి ఏ ఏ పనులు సత్వరమే పూర్తి చేయాలో తెలుసుకునేందుకు కేంద్రమంత్రి సుజనా చౌదరిని పిలిపించి తెలుసుకున్నారు గడ్కరీ. త్వరలోనే కాంట్రాక్టర్ మార్పుకు సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం వుంది. ఆ విధంగా బాబు ప్లాన్ తో పోలవరం మీద కేంద్రం దిగొచ్చింది. అయితే వైసీపీ, బీజేపీ లోని కొందరు ఆ క్రెడిట్ బాబుకు రాకుండా చూసేందుకు సుజనా చౌదరి వల్ల ఈ సమస్య తీరిపోయింది అని ప్రచారం చేస్తున్నారు. ఎవరి ఆనందం వాళ్ళది మరి.