అమరావతిలో ఎన్‌హెచ్ఏఐ మోడల్…

Chandrababu says Amravati do design as NHAI model In CRDA Meeting

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) అనుసరించే పద్దతిలో రాజధాని ప్రాంతంలో రైతులకు అందించే ప్లాట్ల (ఎల్‌పిఎస్) మౌలిక వసతుల అభివృద్ధిని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.ఇప్పటికే ఇది సమర్ధ విధానంగా నిరూపితమైనందున ఇదే విధానంలో అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా ప్రక్రియను పూర్తిచేయాలని చెప్పారు.సచివాలయంలో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌ అంశంపై కూలంకుషంగా చర్చించారు.ఎన్‌హెచ్ఏఐ, నమామి గంగా, హెచ్‌ఎండబ్లుఎస్ఎస్‌బీ వంటి మూడు మోడళ్లపై వివరంగా చర్చించి పైనిర్ణయం తీసుకున్నారు.

అమరావతిలో నిర్మించే ప్రముఖుల నివాస భవంతుల ఆకృతులపై మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశం నిర్ణయించింది.ప్రముఖులకు నిర్మించే బంగ్లాలన్నీ ఒకే నిర్మాణశైలితో ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు.సచివాలయ నిర్మాణాలు అందర్నీ ఆకట్టుకునేలా ఉండేలా అవసరమైతే ఐదు టవర్లను నాలుగు టవర్లుగా మార్చి, అంతస్థుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు.

శాఖమూరు పార్కును గాంధీ మెమోరియల్ పార్కుగా మార్చాలని సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై చర్చ జరిగింది.శాఖమూరు పార్కుకు కాకుండా శాసనసభకు దగ్గరలో అభివృద్ధి చేస్తున్న ఉద్యాన వనానికి గాంధీ పార్కు అనే పేరు పెడదామని మంత్రి పి. నారాయణ సూచించగా, దీనిపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.108 అడుగుల ఎత్తుతో నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు.

అక్కడే ఒక రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తున్నందున భవిష్యత్తులో అది ఒక ద్పీపంగా మారుతుందని అధికారులు వివరించారు.ఈ ప్రాంతాన్ని ముఖ్య వినోద, విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు.ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నీరుకొండ పర్వత ప్రాంతం రానున్నకాలంలో రాజధానికే ముఖ్య ఆకర్షణీయ స్థలంగా మారనున్నదని చెప్పారు. ఎన్టీఆర్ ఫిలాసఫీని ఈ విగ్రహం ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి సూచించారు.

విజయవాడ నుంచి వెలగపూడికి సైకిళ్లపై రాకపోకలు సాగించడానికి వీలుగా సాధ్యమైనంత వేగంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.సచివాలయంలో ప్రయోగాత్మకంగా సైకిల్‌పై రాకపోకలు సాగించడానికి తగిన ఏర్పాట్లు చేశామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పగా, వెలగపూడిలో ఏవో మూడు, నాలుగు సైకిల్ స్టాపులు ఏర్పాటు చేస్తే కాదని, రాజధాని ప్రాంతమంతా సైకిల్ మార్గాలను ఏర్పాటుచేసి ప్రజలలో సైకిల్‌పై ప్రయాణాలు సాగించే సంస్కృతిని తీసుకురావాలని అన్నారు.

రాజధాని ప్రాంత పరిధిలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల అధికారులతో చర్చించి ఆయా ప్రాంతాలలో సైకిల్ మార్గాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.‘హనీమూన్ సమయం ముగిసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను.వారం వారం నాలుగైదు గంటల సమయం కేటాయిస్తున్నాను. ఇంకా మీరు మాటలు చెబితే లాభం లేదు.సామర్ధ్యం పెంపుపై ఎలాంటి మార్పు సాధించారు? పనులు కనిపించేలా కార్యాచరణలోకి దిగకుండా ఇంకా మాటలు చెబుతూ పోతే ఎలా? అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.తాను ఈ మాటలు ఆగ్రహంతో అనడం లేదని, ఆవేదనతో చెబుతున్నానని అన్నారు.పనులలో వేగం పుంజుకోవాలని, నిర్మాణ సంస్థలు చురుగ్గా కదలాలని స్పష్టంచేశారు.దుబాయ్, సింగపూర్ నగరాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, అక్కడ ఉన్న ఉత్తమ విధానాలు, నవీన మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.