Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెక్సికో కు సెప్టెంబరు 19 అచ్చిరావడం లేదు. 32 ఏళ్ల క్రితం 1985 సెప్టెంబరు 19న మెక్సికోను అతలాకుతలం చేసిన భూకంపం మళ్లీ అదే రోజు… మెక్సికోను దెబ్బతీసింది. మంగళవారం మెక్సికోను భారీ భూప్రకంపనలు వణికించాయి.
తాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదయింది. భూకంపం ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటిదాకా 150మందికి పైగా చనిపోయినట్టు గుర్తించారు. శిథిలాల కింద వందలాదిమంది ఉన్నట్టు భావిస్తున్నారు. భూకంపాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ…అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించిన కాసేపటికే ఈ భూకంపం సంభవించింది. ప్రకంపనల ప్రభావానికి నడిబొడ్డున ఉన్న కాండెపా ప్రాంతంలో ఐదంతస్థుల భవనం కుప్పకూలింది. గ్యాస్ పైపులైన్లు దెబ్బతిన్నాయి. క్యూయెర్ నవాకా ప్రాంతంలో పాఠశాల భవనం కూలిపోవడంతో అందులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆచూకీ తెలియడం లేదు. దేశంలో విద్యుత్, టెలిఫోన్ లైన్లు దెబ్బతినడంతో దాదాపు 20లక్షల మంది అంధకారంలో మగ్గుతున్నారు. ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. మెక్సికో రోడ్లు ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. దీంత సహాయక చర్యలకు తీవ్ర ఆటంకమేర్పడింది. 32 ఏళ్ల క్రితం ఇదే రోజు భారీ భూకంపం సంభవించి మెక్సికోలో 10వేల మంది మృత్యువాతపడ్డారు. ఆ చేదు జ్ఞాపకాలను మెక్సికో వాసులు ఎప్పటికీ మర్చిపోలేరు.
తాజాగా వారం రోజుల క్రితం మరో భారీ భూకంపం మెక్సికోకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఈ నేపథ్యంలోనూ, 1985 భూకంపం సంభవించి 32 ఏళ్లు గడిచిన సందర్భంగానూ ప్రజలను అప్రమత్తం చేస్తూ, వీధుల్లోఅధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇది ముగిసిన కొన్ని గంటలకే భూకంపాన్ని హెచ్చరిస్తూ సైరన్లు మోగాయి.. చాలా మంది మాక్ డ్రిల్స్ లో భాగంగా ఇవి మోగుతున్నట్టు భావించి ఇళ్లలోనే ఉండిపోయారు. మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణం. అటు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వచ్చిన భూప్రకంప కేంద్రాన్ని ప్యూబ్లా రాష్ట్రంలోని అటెన్సినో సమీపాన 51 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు అమెరికా భూభౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పట్టణం మెక్సికో నగరానికి 120 కిలోమీట్ల దూరంలో ఉంది.