Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకానికి వ్యతిరేకంగా ముప్పేట దాడి జరుగుతుండడంతో కంచె ఐలయ్య మౌనదీక్ష చేపట్టారు. ఐలయ్య పుస్తకంపై వైశ్య సంఘాలతో పాటు….టీఆర్ ఎస్ ప్రభుత్వమూ…హిందూ మత పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు పరకాలలో వైశ్యసంఘాలు తనను అడ్డుకుని నిరసన వ్యక్తంచేయడంతో ఐలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఐదో తేదీన యూనివర్శిటీ ప్రొఫెసర్లతో తన పుస్తకంపై చర్చకు సిద్ధమని పేర్కొన్న ఆయన అంతకుముందు రోజు…అంటే నాలుగో తేదీ వరకు మౌనదీక్షలో ఉంటానని ప్రకటించారు.
అప్పటివరకూ తాను స్వీయగృహనిర్భంధంలో ఉంటానని, ఇల్లు కదలబోనని ఐలయ్య తెలిపారు. ఈ పన్నెండు రోజుల పాటు తాను ఒక్కమాట కూడా మాట్లాడబోనని స్పష్టం చేశారు. నేను హిందువునెట్లయిత పుస్తకంతో మేధావి వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఐలయ్య తాజా పుస్తకంతో వివాదంలో చిక్కుకున్నారు. వైశ్యులను సామాజిక స్మగ్లర్లు గా అభివర్ణించటం, పదే పదే తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూఉండడంతో ఐలయ్యపై వైశ్యుల నుంచే కాక ఇతర అగ్ర కులాల నుంచి సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఐలయ్య పుస్తకంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఐలయ్యకు వ్యతిరేకంగా అన్ని కులాలూ ఒక్కటవుతున్నాయని, ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని కూడా స్వామి హెచ్చరించారు.