Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యుద్ధంలో ఓడిపోయినా పోరాడినవాడికే ప్రత్యర్థి గౌరవం ఇస్తాడు అనడానికి చరిత్రలో చాలా ఆధారాలున్నాయి. అందుకే జగజ్జేత అలెగ్జాండర్ మన పురుషోత్తముడు మీద అంత గౌరవం చూపించింది. కాలం మారింది కదా ఆ విలువలు ఇంకెక్కడ వుంటాయిలే అనుకుంటే పొరపాటే. తెలంగాణ ప్రజలు, నాయకులు ఆ విలువలు అక్షరాలా పాటించి చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య రాష్ట్రం వుండాలంటూ అప్పట్లో ఎంపీ గా వున్న లగడపాటి రాజగోపాల్ ఏ స్థాయిలో యుద్ధం చేశారో తెలిసిందే. ఆ దశలో తెలంగాణ వాదులు, లగడపాటి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. పరిస్థితి మాటలు దాటి చెప్పులు చూపించుకునే దాకా వెళ్ళింది. ఇక పార్లమెంట్ లో విభజన బిల్లు పెట్టేటప్పుడు లగడపాటి పెప్పర్ స్ప్రే వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం అయ్యిందో తెలుసు . అప్పట్లో ఉద్యమ నేతగా వున్న కెసిఆర్ తో చేసిన సవాల్ లో ఓడిపోయిన లగడపాటి రాజకీయాలకే దూరం అయ్యారు.
కొడుకు పెళ్లి శుభలేఖ అందించడానికి లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం హైదరాబాద్ లో తెలంగాణ నేతలందరినీ కలుస్తున్నారు. సీఎం కెసిఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూపిన ఆప్యాయత లగడపాటిని షాక్ కి గురి చేసిందట. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ సహా చాలా మంది నేతలను కలుసుకున్నప్పుడు లగడపాటికి అపూర్వ గౌరవ మర్యాదలు దక్కాయి. సరే నాయకులు కదా మర్యాద కోసం అంతటి గౌరవం చూపారు అనుకుంటే అక్కడి సిబ్బంది, సామాన్య జనం కూడా తనను పలకరిస్తున్న తీరు చూసి లగడపాటి ఆశ్చర్యపోతున్నారట. ఏ ఒక్కరు కూడా పాత విషయాలను గుర్తు చేయకపోగా మళ్లీ రాజకీయాల్లోకి రండి సార్ అని అడగడం చూసి లగడపాటి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారట. ఈ పరిణామం చిన్నదే అనిపించినా భారతీయ సమాజంలో భిన్నత్వానికి వున్న చోటు, తెలంగాణ సమాజంలో క్షమా గుణానికి ప్రతీకగా నిలుస్తుంది.