Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతిపై వివాదాలు కొనసాగుతున్నాయి. సినిమాను వ్యతిరేకిస్తున్న రాజ్ పుత్ కర్ణిసేన తాజాగా పద్మావతి హీరోయిన్ దీపికను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పద్మావతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల గురించి మాట్లాడుతూ దీపిక మనం వెనక్కి వెళ్తున్నామా… ముందుకు వెళ్తున్నామా అని ప్రశ్నించడం రాజ్ పుత్ కర్ణిసేనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రాజ్ పుత్ మహిళలను కించపరిచినందుకు అవసరమైతే దీపికా పదుకునే మీద కూడా చర్యలు తీసుకుంటామని కర్ని సేన హెచ్చరించింది. సినిమాల్లో మహిళలను చూపిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని తెలిపింది. ఇప్పటివరకు తాము ఆడవారి మీద చేయెత్తింది లేదని, కానీ ఈ పోరాటంలో భాగంగా భారత సంస్కృతిని కించపరిచినందుకు శూర్పణఖకు లక్ష్మణుడు చేసిన పనినే తాము దీపికకు చేయడానికి వెనకాడబోమని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు కర్నిసేన సభ్యుడు మహిపాల్ సింగ్ ఓ వీడియో విడుదల చేశాడు. విడుదల తేదీ సమీపిస్తుండడంతో రాజస్థాన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. పద్మావతి విడుదలను వ్యతిరేకిస్తూ రాజ్ పుత్ కర్ణి సేన డిసెంబరు 1న బంద్ కు పిలుపునిచ్చింది. అటు ఉత్తరప్రదేశ్ లో కూడా పద్మావతికి నిరసన సెగలు తగులుతున్నాయి. దీంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. పద్మావతికి సీబీఎఫ్ సీ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేముందు ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. చిత్తోర్ రాణి పద్మిణికి సంబంధించిన సమాచారాన్ని కూడా సెన్సార్ బోర్డుకు సమర్పించాల్సిందిగా సూచించింది. పద్మావతి విడుదలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం, నినాదాలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని యూపీ హోంశాఖ అధికారి కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఈ నెల చివరివారంలో యూపీలో జరగునున్న స్థానిక సంస్థల ఎన్నికలకు డిసెంబరు 1న కౌంటింగ్ నిర్వహించనున్నారు. పద్మావతి చిత్రం కూడా అదే రోజు రిలీజ్ కానుండడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి పద్మావతి సినిమాపై గతంలో ఎన్నడూ లేనంతగా వివాదాలు ముసురుకోవడం బాలీవుడ్ లో ఆందోళన కలిగిస్తోంది.