రాజధాని పేరుతో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు

రాజధాని పేరుతో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు అమరావతి రైతులు షాకిచ్చారు. రాజధాని ప్రాంతంలో రైతుల్ని బాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తమని మోసం చేసిన చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకొని వస్తారని ప్రశ్నించారు.రాజధాని పేరుతో తమను మోసం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని.. ఆ తర్వాతే రాజధానిలో అడుగుపెట్టాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అమరావతి ప్రాంతంలోని ఓ వర్గం రైతులు.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

రాజధానికి టీడీపీ నేతలెవరూ భూములు ఇవ్వలేదన్నారు రైతులు. అమరావతి ప్రాంతంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు 9 వేల ఎకరాలు కొన్నారని ఆరోపించారు. మూడేళ్లలో ప్లాట్లను అభివృద్ధి చేస్తామన్నారు.. ఎందుకు చేయలేదని.. తమకు ఇచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు ఎందుకు హోల్డ్‌లో పెట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారని.. వాటిలో ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. తమకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలియ లేదన్నారు.

వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిలో అన్యాయం జరిగిందని తమ సమస్యల్ని వివరించామని రైతులు గుర్తు చేశారు. జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే పసుపు నీళ్లు చల్లారని.. మరి చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో పర్యటిస్తే ఏ నీళ్లు చల్లాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఇక్కడ అడుగుపెట్టాలంటే క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు.

ఈనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలతో పాటూ అక్కడి తాజా పరిస్థితిని పరిశీలించనున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి.. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కొత్త ప్రభుత్వంలో ఏవైనా పనులు జరిగాయా లేదా.. టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులు ఎంత వరకు వచ్చాయో ఆరా తీయనున్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో కూడా పర్యటించనున్నారు. ఈ టూర్‌ను నిరసిస్తూనే రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.