ఇంటి ఓనర్ ని హత్య చేసిన అద్దెకుంటున్న భార్యాభర్తలు

ఇంటి ఓనర్ ని హత్య చేసిన అద్దెకుంటున్న భార్యాభర్తలు

గ్రామంలో తూరుబిల్లి రేఖా రోహిణి  దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో అద్దెకుంటున్న భార్యాభర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..తూరుబిల్లి రేఖారోహిణి ధవళేశ్వరం క్వారీరోడ్డులో తల్లి వెంకటలక్ష్మితో కలిసి నివాసం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం వెంకటలక్ష్మి చర్చికి వెళ్లడంతో రోహిణి మాత్రమే ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆమెను పక్క పోర్షన్‌లో అద్దెకుంటున్న భార్యాభర్తలు చెక్కా పవన్‌ కుమార్‌ యాదవ్, లక్ష్మి హత్య చేశారు. అనంతరం బంగారంతో పరారయ్యారు.

అనంతపురానికి చెందిన చెక్కా పవన్‌ కుమార్‌ యాదవ్, లక్ష్మి ఈ నెల పదో తేదీన రోహిణి ఇంట్లోకి అద్దెకు వచ్చారు. కేవలం రెండు బ్యాగులతో మాత్రమే ఇంట్లోకి దిగారు. టీవీ చూడడానికి తరచూ రోహిణి ఇంట్లోకి వెళుతూ ఉండేవారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రోహిణి ఇంట్లోకి వెళ్లి కూరగాయల చాకుతో ఆమెను హత్య చేశారు. ఆమె మెడలోని బంగారపు గొలుసు, ఉంగరం లాక్కు న్నారు. అంతలో ఇంటికి వచ్చిన వెంకటలక్ష్మి పై చాకుతో దాడి చేసి ఆమె మెడలోని గొలుసు దోచుకున్నారు.

వెంకటలక్ష్మి పెనుగులాడుతూ ఇంటి వెనుక గోడ దూకి పెద్దగా కేకలు వేసింది. పవన్‌ కుమార్‌ యాదవ్‌ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. ఏఎస్పీ లతామాధురి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ధవళేశ్వరం సీఐ అడబాల శ్రీను తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమార్తె హత్యకు గురి కావడంతో మతిస్థిమితం కోల్పోయిన తల్లి వెంకటలక్ష్మిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో డాగ్స్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌తో వివరాలు సేకరించారు. మృతురాలి అమ్మమ్మ సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.