కుమారుడిని చంపిన తండ్రి

కుమారుడిని చంపిన తండ్రి

కుమారుడిని చంపి, అతడి శవం పక్కనే ఓ రోజు రాత్రంతా నిద్రించాడో తండ్రి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన అలంకార్‌ శ్రీవాత్సవ అనే వ్యక్తి లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇక అప్పటినుంచి ఒత్తిడితో శతమతమవుతున్నాడు. గత శనివారం ఏడేళ్ల కుమారుడ్ని గొంతునులిమి చంపేశాడు. అనంతరం శవం పక్కనే ఆ రాత్రంతా నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన తర్వాత వేరే ఊరిలో ఉన్న భార్యకు ఫోన్‌ చేసి జరిగిన సంగతి చెప్పాడు.

దీంతో ఆమె బంధువులకు విషయం చెప్పింది. వారు ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు తానే నేరం చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.