జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్‌ నగరంలో పోలింగ్‌ శాతం పెంపుపై తీవ్రం కృషి చేసిన అధికారులకు నిరాశే ఎదురవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్‌ను గణనీయంగా పెంచాలని గ్రేటర్‌ అధికారులు కసరత్తు చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ లకు ప్రతిష్టాత్మకంగా మారిన తాజా ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు మన హక్కు… తప్పనిసరిగా అందరూ ఓటు వేయండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

అయినా ఓటింగ్‌ శాతంగాఅంతంతమాత్రమే. దీంతో సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ పోలింగ్‌ సరళిపై ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలసి ఓటు వేసి వచ్చిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ‘‘మేమంతా..ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత… హక్కు!!’’ అంటూ ట్వీట్‌ చేశారు. డైరెక్టర్‌ తేజ, టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి,సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, హీరో విజయ్‌ దేవరకొండ కుటుంబం తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ చాలా ప్రాంతాల్ లోమందకొడిగా సాగుతోంది. పోలింగ్ మొదలై దాదాపు మూడు గంటలు గడుస్తున్నా చాలా చోట్ల పోలింగ్‌ శాతం 3 శాతానికి మించలేదంటే పరిస్థితిని అర్ధం చేసు కోవచ్చు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 8.9 శాతం పోలింగ్‌ నమోదైంది. ఒకవైపు చలి తీవ్రత, కోవిడ్‌-19 ఆందోళన ప్రభావితం చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఇపుడిపుడే కొన్ని చోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఓట్లరు బారులు తీరుతున్నారని స​మాచారం.