ఫోన్‌ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య

ఫోన్‌ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య

ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం… కూస త్రిష(16) గత విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయని తనకు స్మార్ట్‌ ఫోన్‌ కావాలని తండ్రి సంపత్‌ను కోరింది.

పెట్టుబడి సమయమని, డబ్బులు లేవని కొద్ది రోజులు ఆగాలని తండ్రి అనడంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. తరువాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సంపత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.