ఊర్మిళకు ఇదొక మంచి అవకాశం

good opportunity to urmila

బాలీవుడ్‌ నటి, రంగీలా ఫేమ్ ఊర్మిళ మతోండ్కర్‌ శివసేన పార్టీలో చేరారు. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున ఆమె మహారాష్ట్ర శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళకు ఇదొక మంచి అవకాశమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో మంగళవారం (డిసెంబర్ 1) మధ్యాహ్నం ఆమె శివసేన పార్టీలో చేరారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఊర్మిళ మతోండ్కర్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ స్థానం నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పనిచేసి పరాజయం పాల్జేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీని వీడి ఏడాది గడిచిన తర్వాత ఊర్మిళ ఇప్పుడు శివసేనలో చేరారు. మహారాష్ట్ర శాసన మండలిలో గవర్నర్ కోటాలో నామినేట్ చేసే 12 ఎమ్మెల్సీ స్థానాలకు పంపించిన జాబితాలో ఊర్మిళ మతోండ్కర్ పేరు కూడా ఉన్నట్లు శివసేన వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాకు గవర్నర్ బీఎస్ కొశ్యారీ ఆమోదం తెలపాల్సి ఉంది.

డిసెంబరు 1న ఊర్మిళ తమ పార్టీలో చేరబోతున్నారని శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ ఇప్పటికే తెలిపారు. ‘ఆమె (ఊర్మిళ) శివ సైనికురాలు. రేపు మా పార్టీలో చేరబోతున్నారు. మా మహిళా సైన్యం ఇంకా బలపడబోతోంది’ అని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.