ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి ఉన్మాదుల తూటాలకు బలైన యువకుడు

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి ఉన్మాదుల తూటాలకు బలైన యువకుడు

కాల్పుల సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ అయిన అమెరికాలో మళ్లీ కలకలం రేగింది. ప్రధానంగా అమెరికాలో భారతీయులపై కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మైసూరు యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. బాధితుడిని మైసూరులోని కువెంపు నగర్ కు చెందిన అభిషేక్ సుధేశ్ భట్ (25)గా గుర్తించారు. అభిషేక్ మృతి వార్తను మైసూర్ లోని అతని తల్లిదండ్రులకు యూనివర్సిటికి చెందిన అధికారులు ఫోన్ చేసి తెలుపగా వారు షాక్ కి గురయ్యారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి ఉన్మాదుల తూటాలకు బలయ్యాడని వాపోయారు.

అభిషేక్ సుధేశ్ భట్ (25) 2016లో బీటెక్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన అనంతరం ఏడాదిన్నర క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. శాన్ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఓ హోటల్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హోటల్ కు వచ్చిన ఓ దుండగుడు అభిషేక్ తో గొడవపడి  తుపాకితో కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్ర గాయాలతో అభిషేక్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా హోటల్ యాజమాన్యం యూనివర్సిటీ వారికి సమాచారం అందించింది. దీంతో వారు తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేశారు. కాగా  అభిషేక్ తండ్రి సుదేష్ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాను కలిసి కొడుకు మృతదేహాన్ని వీలైనంత తొందరగా భారత్ కి రప్పించాలని కోరారు. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి.. మృతదేహం తొందరగా వచ్చేలా చూస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అభిషేక్ మరణ ఘటన అమెరికాలోని భారతీయులను కలచివేసింది.