ఘోరం: తమ సొంత‌ నౌక‌నే పేల్చుకున్న ఇరాన్‌.. 40 మంది బలి..!

ఇరాన్ పొరపాటు పడింది. ఏకంగా త‌న సొంత నౌక‌నే పేల్చేసుకుంది. మిస్సైల్ ప‌రీక్ష చేప‌ట్టిన ఇరాన్ గార్డ్స్‌.. ఓ లాజిస్టిక్స్ నౌక‌ను పేల్చేశారు. ఈ ఘ‌ట‌న‌లో డ‌జ‌న్ల సంఖ్య‌లో నావికులు చ‌నిపోయిన‌ట్లు సమాచారం అందుతుంది. తాజాగా ఓ మీడియా వెల్లడించిన వివరాలు చూస్తే.. ఏకంగా ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఇరాన్ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్‌కు చెందిన ఫ్రిగేట్ జ‌మర‌న్‌.. తాజాగా యాంటీ షిప్‌ మిస్సైల్ ప‌రీక్ష చేప‌ట్టింది. అయితే ఆ మిస్సైల్‌ పొర‌పాటును కొన‌రాక్ అనే మ‌రో నౌక‌ను టార్గెట్ చేస్తూ లాక్ చేసింది. ఫ్రిగేట్‌ను వ‌దిలిన ఇరాన్.. ఆ ప్ర‌మాదాన్ని నిలువ‌రించ‌లేక‌పోయింది. కాగా ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మాత్రం ఈ ప్ర‌మాదంలో ఒక‌రే చ‌నిపోయిన‌ట్లు స్పష్టం చేస్తుంది. ప‌లువురు గాయ‌ప‌డిన‌ట్లు వెల్లడిస్తోంది.

కాగా స్ట్రెయిట్ ఆఫ్ హ‌ర్మేజ్ వ‌ద్ద జరిగిన ఈ ఘటనను ఓ ప్ర‌మాదం‌గా ఆ దేశం తెలిపింది. ఇరాన్‌కు చెందిన రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ కార్ప్స్ జ‌మర‌న్ యుద్ధ‌నౌక‌ను ఆప‌రేట్ చేస్తున్నారు. అయితే కొన‌రాక్ అనే నౌక త‌న దారి నుంచి వెళ్ల‌క‌ముందే.. జ‌మ‌ర‌న్ ఫ్రిగేట్‌తో దాడి చేశారు. ఈ మధ్య ఇరాన్‌పై అమెరికా ఆగ్ర‌హంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇరాన్ నౌక‌లు ఏవైనా వేధించిన‌ట్లు అనిపిస్తే.. వాటిని వెంట‌నే పేల్చి వేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. కానీ ఇరాన్ మాత్రం సొంత నౌక‌నే పేల్చేసుకుంది. అదేవిధంగా ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కూడా ఇరాన్ పొర‌పాటును ఉక్రెయిన్ విమానాన్ని నేల‌కూల్చిన విష‌యం తెలిసిందే. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ వ‌ద్ద జ‌రిగిన ఆ ప్ర‌మాదంలో 176 మంది మృత్యవాత పడ్డారు.