జగపతి బాబుతో పంచుకున్న కొద్ది రోజులకే

జగపతి బాబుతో పంచుకున్న కొద్ది రోజులకే

టాలీవుడ్ సీనియర్ నటుడిగా వందలాది సినిమాల్లో నటించిన అనుభవం కోట శ్రీనివాస రావు సొంతం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా వేషాలు వేసి సినీ లోకాన్ని మెప్పించారు కోట. అయితే వయసు మీదపడటంతో ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన ఆయన.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అనుభవాలను, వ్యక్తిగత జీవితంలోని విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనకు కడుపుకోత మిగిల్చిన కొడుకు చావును గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు కోట.

”ఇండస్ట్రీలో కొత్త నటీనటులు నిలదొక్కుకోవాలంటే అప్పటికే అనుభవం ఉన్న వారి ప్రోత్సాహం చాలా అవసరం. అందుకే మా అబ్బాయిని ప్రోత్సహించి ధైర్యం చెప్పే బాధ్యత జె.డి. చక్రవర్తి, జగపతి బాబు తీసుకున్నారు. అయితే ఓ రోజు షూటింగ్‌ స్పాట్‌కెళ్లాక చూస్తే ఒక సీన్‌ కోసం అరేంజ్‌మెంట్స్‌ చేస్తున్నారు. అది చూసి నా మనసుకు ఇబ్బందిగా అనిపించింది. మా అబ్బాయి ఆంజనేయ ప్రసాద్‌ ‘గాయం- 2’ సినిమాలో నా కొడుకు వేషం వేశాడు. అయితే ఆ రోజు మా అబ్బాయిని జగపతి బాబు చంపేసే సీన్‌ షూట్ చేస్తారని తెలిసింది.

లొకేషన్‌లో పాడె కూడా రెడీ చేస్తున్నారు. అది సినిమా కోసమే అయినా.. ఎంతైనా కన్న కొడుకు కదా.. నా మనసుకు బాధగా అనిపించి జగపతి బాబుతో పంచుకున్నా. మా అబ్బాయిని అలా పాడె మీద చూడలేనయ్యా. తలచుకుంటేనే కాస్త వణుకు వచ్చేస్తోంది. కాస్త అవాయిడ్‌ చేయండి. వాడిని అలా చూస్తే నేను చేయలేనండీ అన్నా. జగపతిబాబు ఒక్క క్షణం ఆలోచించి ‘మరేం ఫర్లేదు కోట గారు.. మీరు రిలాక్స్ అవండి. ఆ సీన్‌లో అక్కడ మీ అబ్బాయి బదులు డూప్‌ని పెడదాం. మీ ఫీలింగ్‌ నాకు అర్థమైంది’ అన్నారు.

ఏ ముహూర్తాన ఆ మాట అన్నానో గానీ వారం రోజుల్లో నా కొడుకు పోయాడు. వారం తిరిగేసరికి నా బిడ్డని అలాగే పాడె మీద చూడాల్సి వచ్చింది. వాడు బైక్‌ మీద వెళ్తుంటే, వెనుక కోడలు, మనవళ్లు కారులో వెళ్తున్నారు.. సడెన్‌గా యాక్సిడెంట్ జరిగింది. మాకు కడుపుకోత మిగిల్చి మా వాడు కన్నుమూశాడు” అని చెబుతూ కోట శ్రీనివాస రావు ఎమోషనల్ అయ్యారు.