ఎలివేటర్‌ లో అస్థిపంజరం

ఎలివేటర్‌ లో అస్థిపంజరం

ఓ ఆస్పత్రిలో దాదాపు 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్‌ని రెండు మూడు రోజుల క్రితం తెరిచారు. అయితే అనూహ్యంగా దానిలో వారికి ఓ అస్థిపంజరం కనిపించి భయభ్రాంతులకు గురి చేసింది. విషయం పోలీసులు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌ బస్తి జిల్లా కైలీ ప్రాంతంలో 1991 సంవత్సరంలో 500 పడకలతో ఓపెక్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న ఎలివేటర్‌ పాడు కావడంతో ఆరు సంవత్సరాల తర్వాత అనగా 1997లో మూసి వేశారు. అప్పటి నుంచి క్లోస్‌ చేసి ఉన్న ఈ ఎలివేటర్‌ని 24 ఏళ్ల తర్వాత అనగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 1న తెరిచారు. ఈ క్రమంలో దానిలో వారికి ఓ అస్థిపంజరం దర్శనమిచ్చి భయభ్రాంతులకు గురి చేసింది.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఆస్పత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్‌ సిబ్బంది ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. ఈ అస్థిపంజరం పురుషుడిదిగా గుర్తించారు. ఇక పోలీసులు గత 24 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్‌ పర్సన్స్‌ ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు పని చేయని లిఫ్ట్‌లోకి ఈ వ్యక్తి ఎందుకు వెళ్లాడు… అతడే లోపలికి వెళ్లాడా.. లేక ఎవరైనా అతడిని హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి.. దీనిలో పడేశారా.. లేక పొరపాటున సదరు వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి.. ఊపిరాడక చనిపోయి ఉంటాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్‌ఏ రిపోర్ట్‌ వస్తే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.

ఈ సందర్భంగా బస్తి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ఎవరైనా రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే.. మేం కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మగ అస్థిపంజరం వెనక ఉన్న మిస్టరీని పరిష్కరించడానికి జిల్లాలోని 24 పోలీసు స్టేషన్ల పోలీసులు పని చేస్తున్నారు అని తెలిపారు.