ఏకంగా 900 మిలియ‌న్ మార్కును ట‌చ్ చేసిందీ పాట‌

ఏకంగా 900 మిలియ‌న్ మార్కును ట‌చ్ చేసిందీ పాట‌

ఇండియాలో జ‌నాభా 130 కోట్ల దాకా ఉంది. అందులో యూట్యూబ్‌లో పాట‌ల వీడియోలు చూసేవాళ్లు ఎంత‌మంది ఉంటారు? మొత్తం జ‌నాభాలో స‌గం ఉన్నా గొప్పే. అలాంటిది ఒక ఇండియ‌న్ సాంగ్‌కు యూట్యూబ్‌లో 90 కోట్ల వ్యూస్ వ‌చ్చాయంటే అది ఏ స్థాయిలో జ‌నాల హృద‌యాల్లోకి వెళ్లి ఉండాలి.. ఎన్ని చోట్ల ప్లే అవుతుండాలి..? ఆ పాట ఏ రేంజ్ హిట్టో చెప్ప‌డానికి ఇంత‌కంటే రుజువేం కావాలి.

ఇంత‌కీ ఆ పాట ఏదీ అంటారా? త‌మిళంలో ధ‌నుష్‌, సాయిప‌ల్ల‌విల మీద తెర‌కెక్కి రౌడీ బేబీ సాంగ్. ఏడాదిన్న‌ర కింద‌ట విడుద‌లైన మారి-2 చిత్రంలోనిదీ పాట‌. బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ఈ చిత్రానికి. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించాడు.

ప్ర‌భుదేవా చాలా కాలం త‌ర్వాత త‌మిళంలో కంపోజ్ చేసిన పాట ఇది. ధ‌నుష్‌, సాయిప‌ల్ల‌వి ఇద్ద‌రూ సూప‌ర్ డ్యాన్స‌ర్లు కావ‌డం.. ప్ర‌భుదేవా అదిరిపోయే రేంజిలో స్టెప్స్ కంపోజ్ చేయ‌డం.. చాలా క‌ల‌ర్ ఫుల్‌గా మంచి థీమ్‌తో, హుషారెత్తించేలా ఈ పాట‌ను చిత్రీక‌రించ‌డంతో ఇన్‌స్టంట్‌గా జ‌నాల‌కు న‌చ్చేసింది. సినిమా విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నం రేపిన ఈ పాట‌.. ఆ త‌ర్వాత మ‌రింత‌గా జ‌నాల్ని ఆక‌ట్టుకుంది.

దేశ‌విదేశాల్లో ఈ పాట‌కు ఆద‌ర‌ణ ద‌క్కింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అంద‌రూ ఈ పాట‌ను చూసి ఆనందించారు. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తూ వెళ్లింది. కోట్ల‌ల్లో వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఏకంగా 900 మిలియ‌న్ మార్కును ట‌చ్ చేసిందీ పాట‌. ఓ భార‌తీయ పాట‌కు ఈ స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్క‌డం అద్భుత‌మ‌నే చెప్పాలి.