త్రుటి లో తప్పిన బస్సు ప్రమాదం

త్రుటి లో తప్పిన బస్సు ప్రమాదం

ఆ బస్సు గుంటూరు నుంచి అమరావతికి బయలుదేరింది. మరో ఆరు కిలో మీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుతుంది. ఉన్నట్టుండి బస్సు అదుపు తప్పింది. స్టీరింగ్‌పై డ్రైవర్‌ చేతులు ఉన్నా నియంత్రణ చేయలేకపోతున్నాడు.. భరించలేని తలనొప్పి, కళ్లు బైర్లుకమ్మడంతో డ్రైవింగ్‌పై దృష్టిపెట్టలేకపోయాడు. బస్సు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్లడం కనుచూపు మేరలోనే కొండవీటివాగుపై బ్రిడ్జి కనిపించడం, బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ లేపోవడం గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వారి అరుపులతో స్పృహలోకి వచ్చిన డ్రైవర్‌ బస్సును పక్కకుతీసి ఆపడంతో ప్రయాణికులు ఊరిపీల్చుకున్నారు. నొప్పి భరించలేని డ్రైవర్‌ సీటులో కూర్చోలేక రోడ్డుపై పడుకుని తల్లడిల్లాడు. డ్రైవర్‌ను ప్రయాణికుల సాయంతో బస్సు కండక్టర్‌ అమరావతి సీహెచ్‌సీకి తరలించాడు.

గుంటూరు నుంచి అమరావతిగుడి సర్వీసు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రవికిరణ్‌ మధ్యాహ్నం భోజనం తరువాత ఆరోగ్యం బాగాలేదని బస్టాండులో ఆర్టీసీ సంస్థకు చెందిన డాక్టర్‌కు చూపించుకున్నారు. డాక్టర్‌ పారాసిటమాల్‌ మాత్రలు ఇచ్చి పంపించారు. అనంతరం రవికిరణ్‌ డ్యూటీ ఎక్కాడు. బస్సు గుంటూరు నుంచి అమరావతి వస్తుండగా తాడికొండ అడ్డరోడ్డు దగ్గర తనకు తలనొప్పిగా ఉందని రవికిరణ్‌ కండక్టర్‌ కుమారికి చెప్పారు. తీరా ఎండ్రాయి వద్దకు వచ్చేసరికి రవికిరణ్‌ తలనొప్పిని తట్టుకోలేక తల్లడిల్లాడు. కళ్లు బైర్లుకమ్మడంతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళ్లడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు భయపడ్డారు.