రేవంత్ రెడ్డి కి షాక్

రేవంత్ రెడ్డి కి షాక్

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థి దొరకడం ఇబ్బందిగా మారుతోంది. ఇంతకుముందు పార్టీలోనే ఉండి హుజురాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి వేటలో పడింది. అయితే, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి తాము సిద్ధంగా లేనని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై ఎలాంటి స్పష్టతా రాలేదు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మెన్ దామోదర రాజనరసింహ నేతృత్వంలో అభ్యర్థి ఎంపికపై కమిటీ కసరత్తు చేయనుంది. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ సామాజిక వర్గా ఓట్లు గణనీయంగా ఉంటాయి. ఈ క్రమంలో అందుకు తగ్గ అభ్యర్థిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌లతో కూడిన కమిటీ అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరపనుంది.

అంతేకాక, ఈ ఉప ఎన్నికలు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు. దీంతో ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితులు రేవంత్ రెడ్డిపై ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితం దక్కితే రేవంత్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వద్ద మంచి మార్కులు పడే అవకాశం ఉంది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ కూడా అభ్యర్ధిని ఇంకా ప్రకటించలేదు. టీఆర్ఎస్‌లోనూ పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎల్.రమణ పేరు కూడా వినిపిస్తోంది. ఇక బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన భార్య జమున చేసిన వ్యాఖ్యలను బట్టి.. ఈటలకు బదులుగా ఆమె స్వయంగా బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదనే వాదనా వినిపిస్తోంది.