తెలంగాణాలో స్వైన్ ఫ్లూ సైరన్…!

SwineFlu Cases In Telangana Rise To 69 Eleven Serious

తెలంగాణ ప్రజలను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ఈ ప్రాణాంతక బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో వ్యాధి బారిన పడి ఇప్పటికే ఐదుగురు మృత్యువాతపడగా తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మరణించింది. దీంతో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 6కు చేరుకుంది. ఇప్పటికే 63 మందికి స్వైన్ ఫ్లూ సోకగా తాజాగా మరో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో నిన్న సాయంత్రం వరకు నమోదయిన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 69కి చేరుకుంది. స్వైన్ ఫ్లూ అంతకంతకూ విస్తరిస్తుండటం, మరోవైపు శీతాకాలం వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

swinr-flue
కేవలం రెండు రోజుల్లోనే 16 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని చివరి క్షణాల్లో గాంధీకి తరలిస్తుండటంతో ఈ ఆస్పత్రిలో మరణాల సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా సెప్టెంబరు నుంచి జనవరి వరకు స్వైన్‌ ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి ఆరుగురు మరణించారు. దీంతో స్వైన్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

HOSPITAL
37 సర్కారు ఆసుపత్రుల్లో 467 పడకలు సిద్ధం చేసి ఉంచింది. మరోపక్క కర్ణాటక రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ బారిన పడి ఇప్పటికే ఆరుగురు మరణించారు. కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య వందల్లో ఉంది. అక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకూ ఈ వ్యాధి వ్యాపిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలిలో స్వైన్ ఫ్లూ లక్షణాలతో నలుగురు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఒకరికి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.