ఒకటైన ట్రాన్స్‌జెండర్లు

ఒకటైన ట్రాన్స్‌జెండర్లు

ప్రేమికుల రోజున కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఎన్నో మతాంతర పెళ్లిళ్లు.. కులాంతర వివాహాలు జరిగాయి. తాజాగా ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు పెళ్లి చేసుకున్నారు. లింగ మార్పిడి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు తిరువనంతపురం ఎడపజంజిలో సోమవారం ఉదయం 9.30 గంటలకు సంప్రదాయబద్ధంగా ఒకటయ్యారు. బంధు మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.మను కార్తిక, శ్యామ ఎస్ ప్రభ పదేళ్లుగా స్నేహితులు. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వీరిద్దరు ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే అప్పటికి ఇద్దరికీ లింగమార్పిడి శస్త్రచికిత్సలు జరగలేదు. సరైన ఆదాయం కూడా లేదు. ఇద్దరూ తమ కుటుంబాలపై ఆధారపడి బతికేవారు.దాంతో లింగమార్పిడి చేసుకుని జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నారు. ఇప్పటికి వారి కల నెరవేరింది. ప్రస్తుతం శ్యామా ట్రాన్స్‌జెండర్ సెల్ కింద స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు, మను టెక్నో పార్క్‌లో సీనియర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు లింగమార్పిడి చేయించుకున్నారు.

అనుకున్నట్టుగానే హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.అయితే ప్రస్తుతం మన దేశంలో ఈ రకమైన పెళ్లి చట్టబద్ధం కాదు. దాంతోవారు కోర్టును ఆశ్రయించనున్నారు. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, దాంతో వారి లాంటి వారికి మార్గం సుగమం అవుతుందని మను, శ్యామా అన్నారు. అలాగే కావాలని వాలెంటైన్స్‌ డే రోజు పెళ్లి చేసుకోవాలనుకోలేదని, తమ జాతకాల ప్రకారం ఫిబ్రవరి 14న పెద్దలు ముహూర్తం పెట్టారని వారు తెలిపారు.