కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటీ నియమించిన జగన్ 

Trishabhya Committee on Kapu Reservation

ఏపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఉమ్మారెడ్డి, మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబులను నియమిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం చెబుతూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై చర్చించేందుకు కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అన్ని అంశాలపై చర్చించారు. కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టం, భవిష్యత్‌లో తీసుకబోయే నిర్ణయాలపై కమిటీ అధ్యయనం చేయనుందని సీఎం జగన్ వివరించారు.

ఏప్రిల్ 04వ తేదీన కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలని కేంద్రం ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్ర లేఖపై అప్పటి సీఎంగా ఉన్న బాబు..ఎందుకు సమాధానం ఇవ్వలేదనే దానిపై..అధ్యయనం చేయాల్సిందిగా కమిటీకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మంజునాథన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కమిటీ స్టడీ చేయనుంది. అయితే..ఎప్పటి వరకు నివేదిక ఇవ్వనుంది..తదితర విధి విధానాలను ప్రభుత్వం వెల్లడించనుంది.