జర్నలిస్ట్ హత్య కేసులో మరో మలుపు

జర్నలిస్ట్ హత్య కేసులో మరో మలుపు

ఉత్తర్ ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో జర్నలిస్ట్, అతడి స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్ట్ రాకేశ్ సింగ్, అతడి స్నేహితుడు పింటూ సాహూలను శనివారం రాత్రి ఇంట్లో ఉండగా నిప్పంటించి సజీవదహనానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. లలిత్ మిశ్రా, కేశవానంద మిశ్రా అలియాస్ రింకూ, అక్రమ్ అలీలను బహదూర్‌పూర్ అటవీ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టు బలరాంపూర్ ఎస్పీ దేవ్‌రంజన్ వర్మ వెల్లడించారు. ముగ్గురు నిందితులు తామే ఈ ఘోరానికి పాల్పడినట్టు అంగీకరించినట్టు తెలిపారు.

నిందితుడు కేశావానంద మిశ్రా తల్లి గ్రామ సర్పంచ్‌గా ఉన్నారని, ప్రజా నిధులను ఆమె దుర్వినియోగం చేసినట్టు జర్నలిస్ట్ రాకేశ్ సింగ్ బయటపెట్టడంతో కక్ష పెంచుకున్నారని చెప్పారు. పథకం ప్రకారం మాట్లాడాలని ఉందని జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి, వారితో మద్యం తాగించి, తర్వాత ఇంటికి నిప్పంటించారని ఎస్పీ వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా శానిటైజర్‌ ఆ ఇంటిపై పోసి నిప్పంటించి ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని అన్నారు.

లలిత్ మిశ్రా, కేశవానంద మిశ్రాలు ఆల్కహాల్ అధారిత శానిటైజర్ ఉపయోగించి ఇంటికి నిప్పంటించారని, ఇటువంటి ప్లాన్ అమలు చేయడంలో అనుభవం ఉన్న అక్రమ్ అలీ అలియాస్ అబ్దుల్ ఖాదిర్ సాయం తీసుకున్నారని ఎస్పీ వర్మ వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచామని, రిమాండ్ విధించడంతో జైలుకు తరలించామని తెలిపారు. తన కుమారుడిది హత్యేనని జర్నలిస్ట్ రాకేశ్ సింగ్ తండ్రి మున్నా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జర్నలిస్ట్ కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు. ఈ కేసులో నిందితులను పట్టుకోడానికి నాలుగు బృందాలను ఏర్పాటుచేసినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్యకు స్థానిక ప్రభుత్వ షుగర్ మిల్లులో ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందజేశారు. అలాగే పిల్లలకు ఉచితంగా విద్యను అందజేయనున్నట్టు తెలిపారు.