రెండు కిలోల బంగారు నగలు మాయం

రెండు కిలోల బంగారు నగలు మాయం

ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి సంచిలో రెండు కిలోల బంగారు నగలు మాయమైన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ముంబైకి చెందిన రనూజా జువెలర్స్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న జువెలరీ దుకాణాలకు ఆభరణాలను సరఫరా చేస్తుంటుంది. ఈ క్రమంలో దుకాణంలో పనిచేసే గులాబ్‌ మాలిక్‌(32) ఈనెల 23న సాయంత్రం ముంబయి నుంచి 2.120 కిలోల బంగారు ఆభరణాలు(గొలుసులు, బ్రాస్‌లెట్స్‌)తో జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్ బయలుదేరాడు.

24వ తేదీ ఉదయం బస్సు నగరంలోకి రాగానే అమీర్‌పేట వద్ద నిద్ర లేచి చూడగా తన బ్యాగులో ఉన్న ఆభరణాలు కనిపించలేదు. నేరుగా లక్డీకాపూల్‌లో బస్సు దిగిన అతను తన యజమాని శ్రవణ్‌ గెహ్లాత్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. బుధవారం రాత్రి నగరానికి చేరుకున్న యజమాని బంగారు ఆభరణాలు గల్లంతైన విషయంపై సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో సైఫాబాద్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ నిమిత్తం పంజాగుట్ట పీఎస్‌కు బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ రోజు బస్సులో ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నారు.