అతివేగంగా లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం కోష్ట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులు విశాఖపట్నం నుంచి కారులో పలాస వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. కారులో డ్రైవర్ తో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

అదేవిధంగా వెంటనే గాయపడ్డ వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఎడమ ప్రక్క క్యాబ్ టైరు పేలి ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా బాధితులను మందస మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిని ఢిల్లీశ్వరరావు, వసంతగా స్థానికులు గుర్తించారు. అలాగే.. ప్రమాదంలో గాయపడిన 8 ఏళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో చిన్న నారాయణపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.