టాప్ జర్నలిస్టుని టార్గెట్ చేసిన వర్మ

టాప్ జర్నలిస్టుని టార్గెట్ చేసిన వర్మ

వర్మ సినిమా అంటే ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చాక ముంబయి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయాడు. వర్మను అక్కడి మీడియా కూడా లైట్ తీసుకుంది. వర్మ తీసిన క్లాసిక్స్ మీద స్పెషల్ స్టోరీలు చేస్తూ.. అతడి బైట్ కూడా తీసుకోకుండా ఆయా సినిమాల్లో భాగమైన మిగతా వారితో మాట్లాడి సరిపెట్టే పరిస్థితి వచ్చిందంటే వర్మను అక్కడి మీడియా ఎంత తేలిగ్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. మీడియాలో చీకటి కోణాల్ని ఎక్స్‌పోజ్ చేస్తూ వర్మ ‘రణ్’ సినిమా తీయడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.

ఇలాంటి టైంలో వర్మ రూటు మార్చి జాతీయ స్థాయిలో టాప్ జర్నలిస్టుల్లో ఒకడు, అత్యంత వివాదాస్పదుడు అయిన అర్నాబ్ గోస్వామి మీద ఫోకస్ పెట్టాడు. సుశాంత్ మృతి విషయంలో బాలీవుడ్ మీద నిందలు మోపుతూ మిగతా అంశాలన్నింటనీ పక్కన పెట్టి అదే పనిగా స్టోరీలు చేస్తుండటం వర్మకు ఆగ్రహం తెప్పించి ముందుగా ట్వీట్లు గుప్పించాడు.ఇప్పుడేమో ఏకంగా అర్నాబ్.. ది న్యూస్ ప్రాస్టిటూట్ పేరుతో సినిమానే అనౌన్స్ చేశాడు.  అతిథులు ఎంతటి వారైనా చూడకుండా.. వాళ్లకు ఛాన్సే ఇవ్వకుండా నోరేసుకుని పడిపోయే అర్నాబ్ మీద చాలామందికి కోపం ఉంది.

ఆయన్ని టార్గెట్ చేస్తూ తీసే సినిమాను చాలామంది ఎంజాయ్ చేసే అవాకశమూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు అండ అర్నాబ్‌కు ఉందని, భాజపాకు అనుకూలంగా రిపబ్లిక్ నడుచుకుంటుందని అందరికీ తెలుసు.ఇలాంటి బలమైన పర్సనాలిటీ మీద సినిమా అనౌన్స్ చేయడం ద్వారా వర్మ తన దమ్ము చూపించాడు. ఇంత కాలానికి వర్మ సరైన వాడిని టార్గెట్ చేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.