ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య తన భర్తను హత్య చేసింది. ఈ సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సీఐ శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్‌ అనే వ్యక్తితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తన భర్త ముత్యాలు (28) కి తెలిసి పలుమార్లు మందలించాడు. కాగా.. తమకు అడ్డు తగులుతున్నాడని భావించి ప్రియుడు నవీన్‌తో కలిసి భర్త ముత్యాలును హత్య చేసేందుకు పథకం రచించారు.

అదేవిధంగా ఈ నెల 7న ముత్యాలు కూలీ పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11:30 గంటల సమయంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి ముత్యాలు మెడకు చున్నీ బింగించి గట్టిగా లాగి హత్యచేశారు. ఏమీ తెలియనట్లుగా ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించి అంతక్రియలు జరిపించింది. కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్లు ఒప్పుకొని పారిపోయింది.

అనుమానంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. కాగా మృతుడి భార్య ఆమె ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.