ఆటో డ్రైవర్ ఆలోచనకు ఆనంద్ మహింద్రా ఫిదా.. బంపర్ ఆఫర్..!

సోషల్‌ మీడియాలో నిరంతరం యాక్టివ్‌ గా ఉండే ఆనంద్‌ మహింద్రా దృష్టి ఈ సారి ఓ ఆటో డ్రైవర్‌ మీద పడింది. ఇప్పటి వరకు మందుల్లేని మహమ్మారి కరోనా వైరస్ ను పూర్తిగా నివారించాలంటే… వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక, భౌతిక దూరాలు పాటించడమే మానవాళి ముందున్న ఏకైకా మార్గం. కానీ ఇదే సమయంలో ఓ ఆటోరిక్షాను అరలు అరలుగా మార్చేసి ప్రయాణికులకు సామాజిక దూరం వెలుసుబాటు కల్పించిన.. ఓ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అదికాస్త మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా దృష్టిలో పడింది.

ఇంకేముంది. ఏదైనా దొరకడమే ఆలస్యం వెంటనే స్పందించడం మహింద్రా నైజం. ఆ ఆటోరిక్షాను ఐదు భాగాలుగా విభజించిన సదరు డ్రైవర్‌ వినూత్న ఆలోచనపై ప్రశంసలు కురిపించారు ఆనంద్ మహింద్రా. క్లిష్ట పరిస్థితుల్లో వేగవంతమైన, వినూత్న ఆలోచనలు చేయగల సామర్థ్యం మన సొంతం. నూతన పరిస్థితులకు అనుగుణంగా విభిన్న ఆలోచనలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అంటూ కామెంట్‌ గుప్పించారు. అంతేకాకుండా ఆ వీడియోను కూడా షేర్ చేశారు.

అంతే కాకుండా.. ఆ ఆటో డ్రైవర్‌ కి బంపర్ ఆఫర్‌ కూడా ఇచ్చారు మహింద్రా. మహింద్రా ఆటో, ఫార్మ్‌ సెక్టార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ జెజురికర్‌ కు తన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. తమ ఆటో బిల్డింగ్‌ కంపెనీలో ఈ-ఆటోరిక్షా డ్రైవర్‌ను సలహాదారుగా పెట్టుకుందామని తెలిపారు. అలాగే.. ఆనంద్ మహింద్రా వేసిన ట్వీట్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆయన స్పందనపై ప్రశంసల వర్షం కురుస్తుంది. నెటిజన్లు.. 17 గంటల్లోనే 6.1 వేల రీట్వీట్లు, 28.4 వేల లైక్‌లు.. 651 కామెంట్లు గుప్పించేయడం విశేషంగా చెప్పవచ్చు.