పైలట్‌ను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా

పైలట్‌ను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. అయితే, తాజాగా మరో అంశంపై స్పందించారు. దేశంలో రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందిన శివంగి సింగ్‌ను అభినందించారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా మహీంద్రా పంచుకున్నారు. ఆ ట్వీట్‌లో ఇలా.. “అవును! మీరు శివంగి లాగా శత్రువుల మీద విరుచుకు పడండి! మీరు మా రాఫెల్ రాణి” అని పేర్కొన్నారు.ఇక దేశంలో రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందింది శివంగి సింగ్‌.

ఎయిర్‌‌ ఫోర్స్‌ శకటంపై ఆమె సెల్యూట్‌ చేస్తూ కనిపించింది. అలాగే, ఎయిర్‌‌ ఫోర్స్‌ శకట ప్రదర్శనలో పాల్గొన్న రెండో మహిళా పైలట్‌గా కూడా ఈమె ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మంగా కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి శకటంపై నిల్చుని జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని సెల్యూట్ చేస్తూ కనిపించింది. అలా ఈ రిపబ్లిక్‌ డేన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా శివంగి సింగ్ నిలిచింది. వారణాసికి చెందిన శ్రీమతి సింగ్ 2017లో ఐఎఎఫ్‌లో చేరారు. ఐఎఎఫ్ రెండవ బ్యాచ్ మహిళా ఫైటర్ పైలట్లలో నియమించబడ్డారు. రాఫెల్ నడపడానికి ముందు ఆమె మిగ్-21 బైసన్ విమానాలను నడిపింది. పంజాబ్‌లోని అంబాలా కేంద్రంగా పనిచేస్తున్న ఐఎఎఫ్ గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్’లో ఆమె భాగం.