తెలుగు పరిశ్రమ స్థాయి రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. బాహుబలి చిత్రం తర్వాత అన్ని ఇండస్ట్రీలు టాలీవుడ్ వైపు చూస్తున్నాయి. తెలుగులో మంచి కథాంశం ఉన్న చిత్రాలు రూపొందుతుండడంతో వాటిని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా సందీప్ కిషన్ నిర్మించిన నిను వీడని నీడను నేనే చిత్రాన్ని రీమేక్ చేసేందుకు హిందీ మేకర్స్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని సందీప్ కిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ స్త్రీ నిర్మాతలు, షోర్ ఇన్ ది సిటీ దర్శకులు రాజ్, డీకేలు. వారు నా మార్గదర్శకులు, సోదరులు . నా సినిమా రీమేక్ రైట్స్ వారు తీసుకున్నారు. నా సినిమా మంచి చేతుల్లో పడినందుకు ఆనందంగా ఉంది’ అని సందీప్ తన ట్వీట్ లో తెలిపాడు.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం తరువాత యువ హీరో సందీప్కిషన్ సక్సెస్ అనే మాట విని చాలా కాలమయింది. ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్కిషన్ తెలుగు, తమిళ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు . తొలిసారి థ్రిల్లర్ జోనర్ని ఎంచుకున్నాడు. తనే నిర్మాతగా మారి మిత్రులతో కలిసి నినువీడని నీడను నేనే అంటూ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించాడు. కొత్త దర్శకుడు కార్తిక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్తోనే ఆకట్టుకున్న సందీప్ .. టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులకు కొత్త సినిమాని చూపించబోతున్నాననే సంకేతాల్ని అందించాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాని వేరే భాషలలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయి.