దేశంలో మరో వ్యాక్సిన్

దేశంలో మరో వ్యాక్సిన్

దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. మోడెర్నా అభివృద్ధి చేసిన టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. ముంబయికి చెందిన సిప్లా సంస్థ భారత్‌లో మోడెర్నా టీకా అనుమతి కోసం దరఖాస్తు చేసింది. మోడెర్నా టీకా వినియోగానికి అనుమతి లభించడంతో దేశంలో నాలుగో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ టీకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ భారత్‌లో వినియోగిస్తున్నారు.

అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపాయి. కరోనా మహమ్మారిపై ఈ టీకా 90 శాతం ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడయ్యింది. డబ్ల్యూహెచ్ఓ కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా భారత్‌కు ఉచితంగా టీకాలను అందజేయడానికి అమెరికా అంగీకరించినట్టు మోడెర్నా పేర్కొంది.

మోడెర్నా, ఫైజర్ ఎంఆర్ఎన్ఏ టీకాలు. కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్‌ కణాలపై పోరాడటం ద్వారా ఈ టీకా పనిచేస్తుంది. ఇటీవల ఫైజర్ సీఈఓ అల్బెర్ట్ బౌర్లా మాట్లాడుతూ.. భారత్‌లో తమ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుందని, అనుమతుల అంశం తుది దశకు చేరుకుందని తెలిపారు. అతి త్వరలోనే టీకా సరఫరాపై భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి సంస్థల టీకాలకు ఎప్పట్నుంచో అడుగుతున్న నష్టపరిహార మినహాయింపునకు కేంద్రం సిద్ధమైంది. ఇతర దేశాలు కూడా ఈ మినహాయింపులనిచ్చాయని, ఇక్కడ కూడా ఇవ్వడంలో సమస్య ఉండదని కేంద్ర వర్గాలు తెలిపాయి. ‘‘ఆ కంపెనీలు మనదేశంలో అత్యవసర వినియోగ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే నష్టపరిహార మినహాయింపునివ్వడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని స్పష్టం చేశాయి.