మేమంతా ఒకే కుటుంబం అంటున్నబాహుబలి టీం

మేమంతా ఒకే కుటుంబం అంటున్నబాహుబలి టీం
ఇండియన్‌ సినిమా స్థాయిని హాలీవుడ్‌ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించి ఈ మూవీ ఇండియన్‌ సినిమా గత రికార్డులన్నింటినీ చెరిపేసింది. రెండు భాగాలు కలిపి 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినీ రంగంలో వంద కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించవచ్చనే నమ్మకాన్ని కలిగించింది.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రభాస్‌, రానాలపై అభిమానం ఖండాతరాలు దాటింది. ఇంతటి ఘనవిజయం సాధించింది కనుకే ఈ సినిమా రిలీజ్‌ అయి రెండేళ్లు దాటిపోయినా ఇప్పటికీ బాహుబలి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ విజువల్‌ వండర్‌ మరోసారి వార్తల్లో నిలిచింది.

త్వరలో బాహుబలి టీం మరోసారి కలవబోతున్నారు. ఈ కలయిక మరో సీక్వెల్‌ కోసం కాదులెండి. ఈ నెల 19న లండన్‌లో ఆల్బర్ట్‌ హాల్‌లో `బాహుబలి: ది బిగినింగ్‌` సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు హీరో ప్రభాస్‌, దర్శకుడు రాజమౌళితో పాటు ఇతర టీం సభ్యులంతా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని హీరో ప్రభాస్‌ తన ఇన్స్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.

బాహుబలి ది బిగినింగ్‌ సినిమాతో పాటు స్కైఫాల్, హారీపోటర్ లాంటి హాలీవుడ్ చిత్రాలను కూడా ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. అంతేకాదు ఇదే వేదిక మీద బాహుబలి చిత్ర సంగీత దర్శకుడు స్వరవాణి కీరవాణి ఆధ్వర్యంలో సంగీత విభావరి కూడా జరగనుంది.

2011లో మొదలైన బాహుబలి ప్రయాణం ఐదేళ్లకు పైగా సాగింది. రాజమౌళి, ప్రభాస్‌లు మరో సినిమాకు అంగీకరించకుండా ఐదేళ్లపాటు ఇదే ప్రాజెక్ట్‌ మీద వర్క్‌ చేశారు. వారి కష్టానికి ఫలితం అన్నట్టుగా బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. భారత్‌లోనే కాదు జపాన్‌, మలేషియా లాంటి దేశాల్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మారథం పట్టారు.