‘ఒక్క ఛాన్స్’ కావాలంటున్న బండ్ల గణేష్

'ఒక్క ఛాన్స్' కావాలంటున్న బండ్ల గణేష్
నటుడి నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్‌ తరువాత రాజకీయాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రాజకీయాలు ఈ కామెడీ స్టార్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. గణేష్‌ సీరియస్‌గా పాలిటిక్స్‌ మీద దృష్టి పెట్టినా అది కామెడీనే అయ్యింది. దీంతో కొద్ది రోజులపాటు మీడియా కంటపడకుండా తిరిగిన గణేష్‌ తిరిగి తనకు కలిసొచ్చిన నటన మీద దృష్టిపెట్టాడు.
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కమెడియన్‌గా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలో గణేష్‌ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. నటుడిగా కొనసాగుతూనే మరోసారి నిర్మాణరంగం వైపు చూస్తున్నాడు గణేష్‌.
నిర్మాతగా గబ్బర్‌సింగ్‌, టెంపర్‌ లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన గణేష్‌, ఎక్కువగా ఫ్లాప్స్‌నే ఎదుర్కొన్నాడు. దీంతో ఆర్థిక సమస్యలతో నిర్మాణ రంగానికి కూడా దూరమయ్యాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత మరోసారి నిర్మాతగా సినిమాను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకోసం గతంలో తన సినిమాలో నటించిన మెగా హీరోను కాకాపడుతున్నాడు.

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో `గోవిందుడు అందరి వాడేలే` సినిమాను నిర్మించాడు బండ్ల గణేష్‌. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా హిట్ టాక్‌ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మరోసారి తనకు నిర్మాతగా అవకాశం ఇవ్వాలని మెగా పవర్‌ స్టార్‌ను ట్వీట్టర్‌ ద్వారా వేడుకున్నాడు గణేష్‌.