కొడుకుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న బెల్లంకొండ సురేష్

కొడుకుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న బెల్లంకొండ సురేష్

టాలీవుడ్లో పెద్ద పెద్ద కుటుంబాలున్నాయి. వాళ్లకు వందలు వేల కోట్ల ఆస్తులున్నాయి. కానీ ఆ కుటుంబాల్లో ఎవరూ కూడా తమ వారసుల మీద చేయనంత ఖర్చు బెల్లంకొండ సురేష్ చేశాడు. తన పెద్ద కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా నిలబెట్టడానికి ఆయన ఇప్పటిదాకా ఒక వంద కోట్లయినా ఖర్చు పెట్టి ఉంటారంటే అతిశయోక్తి కాదు. శ్రీనివాస్ తొలి సినిమాకే ఏకంగా రూ.35 కోట్ల దాకా వెచ్చించాడు సురేష్.

ఆ తర్వాత వేరే నిర్మాతల్ని ముందు పెట్టి తెర వెనుక నుంచి కోట్లు కోట్లు కుమ్మరిస్తూ వచ్చాడు. అయినా శ్రీనివాస్ ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేదు. ఈ మధ్యే ‘రాక్షసుడు’ సినిమాతో పర్వాలేదనిపించాడు. ఈ చిత్రం పెద్ద కొడుకు కాస్త కుదురుకున్నాడనిపించేసరికి.. చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్‌ను తెరమీదికి తీసుకొచ్చే పని మొదలైంది.

గణేష్ హీరోగా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. పవన్ దర్శకుడు కాబట్టి వి.వి.వినాయక్‌ ‘అల్లుడు శీను’కు పెట్టించినట్లుగా భారీ బడ్జెట్ పెట్టించరనే అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్ల పాత్రలు పెట్టడం ద్వారా సురేష్‌కు పెద్ద టాస్కే ఇచ్చాడట పవన్. ఇందులో ఇప్పటికే ముగ్గురు కథానాయికలు ఖరారయ్యారు.

‘హుషారు’ ఫేమ్ దక్ష నగార్కర్‌తో పాటు నటాషా, ‘మజిలీ’ ఫేమ్ అనన్య అగర్వాల్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. ఇంకో ఇద్దరు హీరోయిన్ల కోసం వెతుకుతున్నారు. ఆ ఇద్దరు కాస్త పేరున్న హీరోయిన్లే కాావాలనుకుంటున్నారట. కాస్త ఎక్కువ పారితోషకమైనా ఇచ్చి సినిమాకు కమిట్ చేయించాలని చూస్తున్నారట. ఇక ఈ చిత్రంలో మెజారిటీ పోర్షన్ అమెరికాలో చిత్రీకరిస్తారట. దీనికంతటికీ ఖర్చు గట్టిగానే అవుతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి కొడుకుల మీద సురేష్ మామూలుగా ఖర్చు చేయట్లేదన్నమాట.