బెంగళూరు నగరంలో కుటుంబం ఆత్మహత్య

బెంగళూరు నగరంలో కుటుంబం ఆత్మహత్య

బెంగళూరు నగరంలో గత శుక్రవారం వెలుగుచూసిన ఒకే కుటుంబంలో తల్లీ ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆత్మహత్య, మగశిశువు మృతి కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. తమ ఆత్మహత్యకు తండ్రి శంకర్‌కు మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని కొడుకు మధుసాగర్‌ రాసిన డెత్‌నోట్‌ పోలీసుల సోదాల్లో ఆదివారం ఉదయం బయటపడింది. తండ్రి వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రాశాడు. తన లాప్‌టాప్‌లో అన్ని వివరాలు ఉన్నట్లు తెలిపాడు.

కూతుళ్లు సించన, సింధూరాణి గదులలో లభించిన డెత్‌నోట్‌లలోనూ తండ్రి వివాహేతర సంబంధం గురించి ప్రస్తావించారు. సించన అత్తవారింట్లో సంతోషం లేదని రాసింది. దీంతో లేఖలను, లాప్‌టాప్‌ను బ్యాడరహళ్లి పోలీసులు క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు.శంకర్‌ ఇంట్లో సోదాల్లో దొరికిన కేజీ బంగారం, రూ.12 లక్షలు నగదును కూడా పోలీసులు సీజ్‌ చేసి ఇంటికి తాళాలు వేశారు.

శంకర్‌ విజ్ఞప్తి మేరకు పంచనామా సమయంలో విజయనగర ఎసీపీ నంజుండేగౌడ నేతృత్వంలో సీఐ రాజీవ్‌లు ఇంటిలోని ప్రతిభాగాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. మృతుల మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని విశ్లేషించే పనిలో ఉన్నారు. అల్లుళ్లు ప్రవీణ్, శ్రీకాంత్‌లను ప్రశ్నించారు. ఇక శంకర్‌పై కుటుంబీకులే ఆరోపణలు చేయడంతో పోలీసులు ఆయన మీద దృష్టి సారించారు. మరోవైపు అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తన భార్యే గొడవలకు కారణమని శంకర్‌ రోదించాడు.