జూబ్లీహిల్స్‌ లో బైక్‌పై నుంచి పడి యువకుడు దుర్మరణం

జూబ్లీహిల్స్‌ లో బైక్‌పై నుంచి పడి యువకుడు దుర్మరణం

ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన కుంచాల వంశీకృష్ణ(26) ఓ ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం లింగంపల్లికి వెళ్లడానికి ద్విచక్రవాహనం పై బయలుదేరి జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 10లోని వాక్స్‌బేకర్స్‌ సమీపంలోకి రాగానే మ్యాన్‌హోల్‌ గుంతలో వాహనంపడి అదుపుతప్పి కిందపడిపోయాడు. తల డివైడర్‌కు ఢీకొని తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు రైట్‌–లెఫ్ట్‌ రహదారుల్ని వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు ప్రస్తుతం నగర వాసులకు భయం పుట్టిస్తున్నాయి. వీటితో పాటు మధ్యలో ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుల్లో కొన్ని ప్రమాదహేతువులుగా మారడంతో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు తీవ్రంగా గాయపడుతున్నారు. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెప్తున్నారు.