తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌ కోరలు

తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌ కోరలు

తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌ కోరలు చాస్తోంది. కరోనా నుంచి బయటపడ్డామన్న సంతోషాన్ని దూరం చేస్తూ ఎందరో జీవితాలను నాశనం చేస్తోంది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో చాలామంది ‘బ్లాక్ ఫంగస్’ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ‘బ్లాక్‌ ఫంగస్‌’ నోడల్‌ కేంద్రమైన హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 284 మంది బ్లాక్‌ ఫంగస్‌ అనుమానితులు ఆస్పత్రికి రాగా.. 39 మందిని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ చేసుకున్నారు.

మిగతా వారిలోనూ చాలా మందికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు ఉన్నా.. కొందరు పాజిటివ్‌ రోగులు కావడం, మరికొందరికి కోవిడ్‌ వచ్చి తగ్గినా ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ లేకపోవడంతో చేర్చుకోలేదు. చాలా తక్కువగా లక్షణాలు ఉన్నవారికి మందులు రాసి ఇంటికి పంపించేశారు. తాజాగా అడ్మిట్‌ అయినవారితో కలిపి ప్రస్తుతం ఈఎన్‌టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘బ్లాక్‌ ఫంగస్‌’ బాధితుల సంఖ్య 90కి చేరింది. వీరిలో ఏడుగురికి గురువారం శస్త్రచికిత్సలు నిర్వహించారు.

గురువారం ఒక్కసారిగా 284 మంది ‘బ్లాక్‌ ఫంగస్‌’ అనుమానితులు రావడంతో ఈఎన్‌టీ ఆస్పత్రి ఆవరణంతా కిక్కిరిసిపోయింది. వీరిలో కొందరు కరోనా పాజిటివ్‌ వారు ఉండటం, మరికొందరికి కోవిడ్‌ తగ్గినా ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ లేకపోవడంతో హాస్పిటల్‌లో చేర్చుకోకుండా తిప్పి పంపేశారు. మరికొందరిని వివిధ టెస్టుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

ఉస్మానియాకు, ఇతర ల్యాబ్‌లకు టెస్టుల కోసం పరుగెత్తడం, ఇందుకు రోజంతా సమయం పట్టడంతో ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఆలస్యం అవుతోందని రోగుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈఎన్‌టీ ఆస్పత్రికి వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచుతున్నారు. తొలుత 50 బెడ్లను ఏర్పాటు చేయగా… ప్రస్తుతం బెడ్ల సంఖ్యను 200 వరకు పెంచినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి.