మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

మద్యం మత్తులో మందుబాబులు సృష్టించే హడావుడి అంతా ఇంతా కాదు… అసలు వారిని ఆ సమయంలో అడ్డుకోవడం కూడా ఎవరి తరం కాదు. దానికితోడు కరోనా కారణంగా మద్యం దుకాణాలు ఒక్కసారిగా తెరుచుకోవడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఇలాగె మద్యం మత్తులో ఒక వ్యక్తి నానా వీరంగాన్ని సృష్టిస్తూ, ట్రాన్స్ఫార్మర్ తో ఆటలాడాడు… చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు… ఈ దారుణమైన దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా, కోరుట్ల నంది చౌరస్తా సమీపంలో జరిగింది. కాగా ఈ యువకుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం, వెంగళాపూర్ గ్రామానికి చెందిన సుబ్బారాయుడు గా గుర్తించిన పోలీసులు, కొంత కాలం క్రితం వలస కార్మికుడిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడని వెల్లడించారు.

ఇకపోతే మద్యం మత్తులో సుబ్బారాయుడు అనే వ్యక్తి నడిరోడ్డుపై చిందులు వేస్తూ, అందరిపై రాళ్లు విసురుతూ, కనపడ్డ వారితో గొడవకు దిగుతూ, నోటికొచ్చినట్టు అరుస్తూ విచిత్ర చేష్టలు చేశాడు. అక్కడితో ఆగకుండా, నడిరోడ్డుపై బండరాయిని పెట్టి పడుకున్నాడు. ఆ తరువాత కొంత సమయానికి రోడ్డుపై నుంచి లేచి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లి, దాన్ని పట్టుకొని, షాక్ కి గురై చివరికి తన ప్రాణాలు వదిలాడు. అయితే అతడి ప్రవర్తన కారణంగా, ఆ వ్యక్తిని కాపాడేందుకు స్థానికులెవరు కూడా సాహసించలేకపోయారు. ఇకపోతే కల్తీ మద్యం తాగినందువల్లే ఆ వ్యక్తి ఆలా మతిస్థిమితం లేని వాడిలా ప్రవర్తిస్తూ, చివరికి తన ప్రాణాలను కోల్పోయాడని స్థానికులు వాఖ్యానించారు.