మోహన్ బాబుపై కేసు

మోహన్ బాబుపై కేసు

సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం డిమాండ్ చేసింది. గొర్రెల కాపరులను అవమాన పరిచేలా చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలంది. మోహన్ బాబుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలంటూ మంగళవారం ఆ సంఘం నేతలు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తొర్రూర్ పోలీస్ స్టేషన్‌లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ మరికొందరు నేతలతో కలసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు.. మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ బాబు ఇష్టారీతిన కామెంట్లు చేశారన్నారు. గొర్రెల కాపరులను అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉందని, అందరూ చూస్తున్నారని మోహన్ బాబు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

మోహన్ బాబు కామెంట్లతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు పోలీసులను కోరామని చెప్పారు. గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. అంతేకాకుండా గొర్రెల కాపరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.