పవన్ వ్యాఖ్యల్లో అర్ధమే లేదు !

CBN Slams pavankalyan for his allegestations

కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నేత సీఎం రమేశ్ గత పదకొండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. నిరాహార దీక్ష చేస్తోన్న సీఎం రమేశ్‌ను శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి పరామర్శించారు. శనివారం ఉదయం కడప చేరుకున్న చంద్రబాబు, టీడీపీ ఎంపీ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఆయనకు నచ్చజెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం దీక్షను చేపట్టిన సీఎం రమేష్, బీటెక్ రవిలను అభినందించారు. మీరు చేపట్టిన దీక్ష యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు.
ఈ దీక్షలు వృథాగా పోవని, కడప ఉక్కు పరిశ్రమ మీ వల్లే వచ్చిందనే విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బాబు వ్యాఖ్యానించారు.

స్టీల్ ప్లాంట్ కోసం మన పోరాటం ఇంతటితో ఆగిపోలేదని, అందరం సంఘటితమై సాధించేవరకూ పోరాటం కొనసాగిద్దామని పిలుపు నిచ్చారు. అంతకు ముందు వైసీపీ, జనసేన, బీజేపీలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓ వైపు జనసేనాని పవన్ కల్యాణ్, మరోవైపు వైసీపీ అధినేత జగన్‌లు ఉన్నారంటూ సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం కోసం పోరాడతానంటోన్న పవన్ మాటల్లో ఏమైనా అర్థం ఉందా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట అలాంటి ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కుట్రదారులు చివరకు తిరుమల వేంకటేశ్వరస్వామితో కూడా ఆడుకుంటున్నారని శ్రీవారికి పింక్ డైమండే లేదని, ఓ పూజారి చెప్పే మాటలకు జగన్, జనసేనానిలు వత్తాసు పలుకుతున్నారని వీళ్ల నిర్వాకం వల్లే తిరుమలను తామెందుకు స్వాధీనం చేసుకోకూడదంటూ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లేఖ రాసే పరిస్థితి వచ్చిందని అన్నారు. స్వామివారి నగలన్నీ లెక్కల ప్రకారమే భద్రంగా ఉన్నాయని, వీళ్లు మాత్రం మాయమైపోయానని అంటున్నారని విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డి, జగన్‌లతో కలిసి బీజేపీ నాటకాలు ఆడిస్తోందని జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారని ఈ అన్నదమ్ములు ఇద్దరి సంగతి ఏంటో అందరికీ తెలుసని బాబు అన్నారు. వైయస్ హయాంలో గాలి జనార్దన్ రెడ్డి‌తో బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుచేయడానికి ప్రయత్నం జరిగిందని కానీ ఆ పప్పులు ఉడకలేదని అన్నారు. ఏపీని దేశంలోనే నెంబర్ చేసే బాధ్యతను తాను తీసుకున్నానని దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు.