మహేష్‌25కు మళ్లీ కష్టాలు

PM Modi's Yoga Delays Mahesh Babu25th Film

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రంకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ‘భరత్‌ అనే నేను’ విడుదలైన వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభించాలని భావించారు. కాని నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రంపై కోర్టుకు వెళ్లడంతో పాటు, నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన కారణంగా సినిమాను షూటింగ్‌ ఆలస్యంగా ప్రారంభించారు. ఇటీవలే డెహ్రాడూన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. అక్కడ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలోనే అక్కడ నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్టుండి వచ్చేశారు. షూటింగ్‌కు అంతరాయం కలిగిన కారణంగానే అక్కడ నుండి వెళ్లి వచ్చినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు చిత్రీకరణ అక్కడే జరపాల్సి ఉంది. కాని స్థానిక అధికారులు షూటింగ్‌కు అనుమతి లేదని, నెలరోజుల తర్వాత మళ్లీ రావాల్సిందిగా సూచించడం జరిగింది.

డెహ్రాడూన్‌లోని ఒక ప్రముఖ కళాశాలలో ఈ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఆ కళాశాలలో నెల రోజుల పాటు యోగా సెలబ్రేషన్స్‌ జరపాలని ఆరు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. ఆ కారణంగానే యోగా సెలబ్రేషన్స్‌ నిమిత్తం మహేష్‌ మూవీ షూటింగ్‌కు అడ్డు చెప్పారు. ఆగస్టు మొదటి లేదా రెండవ వారం నుండి మళ్లీ డెహ్రాడూన్‌లో చిత్ర యూనిట్‌ సభ్యులు చిత్రీకరణ మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈలోపు హైదరాబాద్‌లో ఏమైనా చిత్రీకరణ చేస్తారా అనేది చూడాలి. మహేష్‌బాబుకు జోడీగా ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమెతో పాటు సమ్మోహనం హీరోయిన్‌ అదితి రావు కూడా నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.