చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !

Chandrababu questions party MPs' fun over CM Ramesh fast

టీడీపీ ఎంపీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ ఎంపీలు కొందరు సరదాగా సీఎం రమేష్ దీక్షపై వ్యాఖ్యలు చేశారు. బరువు తగ్గాలంటే ఆమరణ నిరహారదీక్షలు చేయాలని అభిప్రాయపడ్డారు. దీక్షలపై సెటైర్లు వేసుకొన్నారు. ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీ మోహన్‌లపై జోకులు పేల్చారు. తాను ఐదు కిలోల బరువు తగ్గాలని భావిస్తున్నానని ఎంపీ మురళీమోహన్ అన్నారు. అయితే తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. అయితే వారం రోజుల పాటు తాను దీక్ష చేసేందుకు సిద్దమన్నారు. దీంతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కల్పించుకొన్నారు. అప్పుడు జేసీ మన డాన్‌ ఉన్నాడుగా అంటూ అవంతి ని సూచించారు. అయితే మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకొన్నారు. ఆయనను మొదటిరోజునే రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసుకుని అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీల తీరును తప్పుబట్టారు. ఎంపీలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు.

ఢిల్లీలో ఉన్న ఎంపీలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి.. ఈ వ్యవహారంపై వివరణ కోరారు. అందరూ సీరియస్‌గా ఉన్న సమయంలో ఇలాంటి సరదా వ్యాఖ్యలు చేయడం ఏంటని, ఎంపీ సీఎం రమేష్ ఓవైపు దీక్ష చేస్తుంటే.. ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు పడితే వారు.. ఏది పడితే అది మాట్లాడొద్దని హెచ్చరించారు. ఛలోక్తులకు ఇది సమయం కాదని.. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయొద్దని సూచించారు. చంద్రబాబు సీరియస్‌ కావడంతో ఎంపీలు కూడా వివరణ ఇచ్చారు. తమ వ్యాఖ్యల్ని కొంతమంది వక్రీకరించారని ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌లు అన్నారు. ఆ వీడియోను ఎడిటింగ్ చేశారని 75ఏళ్ల వయస్సులోనూ వారం రోజులు దీక్ష చేయగలమా అన్న మాటల్ని మాత్రం కట్ చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత.. టీడీపీ చేసే పోరాటంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు ఈ వీడియోపై విచారణ జరిపిస్తానని బాధ్యులు పార్టీ వ్యక్తులైతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

అంతేకాదు ఎంపీలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ధర్మపోరాటం వైపు చూస్తోందని టీడీపీ ఎంపీల ఉద్యమంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేశారని.. ఇప్పుడు మురళీ మోహన్ మాట్నలి కట్ అండ్ పేస్ట్ చేశారని రాష్ట్రానికి హాని చేసే వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉంటూ కుట్రదారుల చేతుల్లో పావుల్లా మారొద్దని సూచించారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొంటూ ప్రతిపక్షాలు చేసే కుట్నల్ని అధిగమించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కుట్రలు పెరిగిపోతాయని.. వాటిని భగ్నం చేయాలన్నారు. నేరస్థులు, బ్లాక్‌మెయిలర్లతో పోరాటం అంత సులభం కాదని.. ప్రతి క్షణం అప్రమత్తంగా, సీరియస్‌నెస్‌తో ఉండాలన్నారు బాబు. ఎంతో కీలకమైన ఈ సమయంలో ఏమరపాటుగా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రమూ తగదన్నారు.