వెంకీ జోరు మామూలుగా లేదుగా!

venkatesh movie with Trinadha Rao Nakkina

విక్టరీ వెంకటేష్‌ గత రెండు మూడు సంవత్సరాలుగా కాస్త నెమ్మదిగా చిత్రాలు చేశాడు. అయితే ఈ ఏడాది జోరు పెంచాడు. ‘గురు’ చిత్రం తర్వాత చాలా ఎక్కువ గ్యాప్‌ తీసుకున్న వెంకీ ప్రస్తుతం నాలుగు సినిమాలతో సిద్దం అవుతున్నాడు. అందులో మూడు కూడా మల్టీస్టారర్‌ చిత్రాలు అవ్వడం విశేషం. ఆమూడు మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఒకటి ఇప్పటికే వరుణ్‌ తేజ్‌తో ప్రారంభం అయ్యింది. ఇక రెండవ మల్టీస్టారర్‌ చిత్రం నాగచైతన్యతో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆ చిత్రం కోసం దర్శకుడు బాబీ కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఇక మూడవ మల్టీస్టారర్‌ను తమిళ స్టార్‌ హీరో సూర్యతో చేసే విషయమై ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

మూడు చిత్రాలు చేతిలో ఉన్నప్పటికి త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు వెంకీ సిద్దం అయ్యాడు. ‘నేను లోకల్‌’ వంటి మాస్‌ సక్సెస్‌ను దక్కించుకున్న త్రినాధరావు నక్కిన ప్రస్తుతం వెంకీ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు మూడు సినిమాలను గతంలో వెంకటేష్‌ చేసిన సందర్బాలున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలా సాధ్యం కాదు. కాని వెంకటేష్‌ ఒకే సారి రెండు చిత్రాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక వైపు ఎఫ్‌2లో నటిస్తూనే మరో వైపు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ సంవత్సరం చివర్లో మరో రెండు చిత్రాలు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి వెంకటేష్‌ సంవత్సర కాలంలో నాలుగు సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ నాలుగు కూడా తప్పకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడంతో పాటు, ఆయనకు మంచి పేరును తీసుకు వస్తాయని సినీ వర్గాల వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.