మూడేళ్లుగా కానిస్టేబుల్‌తో ప్రేమ

మూడేళ్లుగా కానిస్టేబుల్‌తో ప్రేమ

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ప్రియుడు మాట తప్పడంతో ప్రియురాలు అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన జిల్లాలోని చిన్న కోడూర్ మండల పరిధిలోని రామునిపట్లలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన పల్లె విద్యను చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ యాసరేని సంతోష్‌ కుమార్‌ మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. మాయమాటలు చెప్పి తనను లోబరుచుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె నిలదీయగా మొహం చాటేశాడు.

ఏడాది క్రితం ఇంట్లో వారి అంగీకారం మేరకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత సైతం ఫోన్‌లో రోజు చాటింగ్‌ చేస్తూ.. తనను పెళ్లి చేసుకుంటానని.. తన వెంట రమ్మని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఇంటి నుంచి వెళ్లిన ఆమెను కరీంగనర్‌లో ఒక అద్దె ఇంట్లో ఉంచాడు. ఆ సమయంలో ఆమెకు మంగళసూత్రం కట్టాడు. ఇప్పుడు ఆమెకు కనబడకుండా తిరుగుతున్నాడు. దీంతో న్యాయం చేసే వరకు రామునిపట్లలో సంతోష్‌కుమార్‌ ఇంటి ఎదుట నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది విద్య. ఆమెకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు నిలిచారు.