చెవిరెడ్డిని టీకి పిలిచిన టీడీపీ అభ్యర్ధి భార్య

చంద్రగిరి రీపోలింగ్ సందర్భంగా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడంతో అధికారవర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రచారంలో ఉద్రిక్తతలు తలెత్తడంతో రీపోలింగ్ ఎలా జరుగుతుందోనని అందరూ టెన్షన్ పడ్డారు అయితే, ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే జరిగింది. ఈ నేపథ్యంలో, పులివర్తివారిపల్లిలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. రీపోలింగ్ తీరుతెన్నులు పరిశీలించేందుకు వైసీపీ అభ్యర్తి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి ఆయనను చూసి మర్యాదపూర్వకంగా పలకరించారు. విభేదాలున్నా పక్కనబెట్టి, “అన్నా టీ తాగి వెళుదురు రండి… ఇంటికి వెళదాం” అంటూ ఆహ్వానించారు. అయితే, చెవిరెడ్డి ఏమనుకున్నారో ఏమో కానీ, సుధారెడ్డి పిలుపులను ఏమాత్రం పట్టించుకోకుండా తన ఫోన్ నొక్కుకుంటూ ముందుకు సాగిపోయారు. అనంతరం, వైసీపీ లోక్ సభ అభ్యర్థి రెడ్డప్ప రాగానే ఆయన్ను కూడా సుధారెడ్డి టీ తాగమని కోరారు. ఆయన చిరునవ్వుతో తిరస్కరించారు. దీనిపై సుధారెడ్డి స్పందిస్తూ, ఎంతటి ప్రత్యర్థులైనా మన గ్రామానికి వచ్చినప్పుడు అతిథులుగానే భావిస్తామని, టీ తాగడం, తాగకపోవడం అనేది వాళ్లిష్టం అని పేర్కొన్నారు.