రాష్ట్రపతి భవన్ ని తాకిన కరోనా: భవన్ లోని కార్మికుడికి పాజిటివ్ .. !

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో గజగజలాడుతోంది. దీంతో దేశంమొత్తం లాక్ డౌన్ లో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ వీథుల్లో వ్యాప్తిచెందిన వైరస్‌ తాజాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌ ను తాకింది. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతనికి కూడా వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతకుముందే అతని కుటుంబంలో ఒకరు వైరస్‌ కారణంగా మృతి చెందారు. తాజాగా అతనికి కూడా వైరస్‌ సోకడంతో పరిసర ప్రాంతాల్లోని 125 కుటుంబాలను అధికారులు స్వీయ నిర్బంధంలోకి పంపించారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశిస్తున్నారు. మొత్తం 125 కుటుంబాల్లో 500 మందిని స్వీయ నిర్బంధంలోకి పంపినట్లు ఢిల్లీ వైద్యులు స్పష్టం చేశారు.

అదేవిధంగా ఈ ఘటనతో రాష్ట్రపతి భవన్‌లో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలోని కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం అర్థరాత్రి నాటికి కరోనా కేసుల సంఖ్య 2,003కి చేరింది. అలాగే… ఇప్పటివరకు వైరస్‌ కారణంగా 45 మంది మృతి చెందారు. దీంతో మే 3వరకు లాక్‌డౌన్‌ పై ఆంక్షలు సడలించేది లేదని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.