ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది.

రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో పూర్తి సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.