ఆస్తి కోసం ఘాతుకం.. ప్రియుడితో కలిసి మాజీ భర్తను హత్య చేసిన మహిళ

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ఆస్తి కోసం ప్రియుడితో కలిసి ఓ మహిళ తన మాజీ భర్తను దారుణంగా చంపేసిన ఘటన విజయవాడలో జరిగింది. బిహార్‌కు చెందిన దినేష్‌కుమార్‌ సింగ్‌ (45) 14 ఏళ్ల కిందట విజయవాడకు వలస వచ్చి స్థిరపడ్డాడు. ఎనికేపాడులోని ఒక చెప్పుల తయారీ సంస్థలో పనిచేసే అతడికి భార్య చింతాసింగ్‌, కుమారులు సత్యం శివం, లక్ష దీప్‌ ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. పిల్లల మైనార్టీ తీరే వరకు తల్లి వద్దే ఉంచాలని కోర్టు సూచించింది.

దినేష్‌కుమార్‌‌కు ప్రసాదంపాడులో సొంతిల్లు ఉంది. ఆ ఇంటిలోనే పై అంతస్తులో చింతాసింగ్‌, పిల్లలు, కింద అంతస్తులో దినేష్‌కుమార్‌ ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. దీనితో రెండేళ్లుగా అదే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు. చింతా సింగ్‌ రామవరప్పాడులోని ఓ బేకరిలో పనిచేస్తుండగా.. దినేష్‌ తన ఇంట్లోనే చెప్పులు తయారుచేసి విక్రయిస్తున్నాడు. పిల్లల పోషణ ఖర్చులు తల్లి భరిస్తుండగా.. స్కూల్ ఫీజులు తండ్రి చెల్లిస్తున్నాడు. 17వ తేదీ రాత్రి గదిలో నిద్రపోయిన దినేష్ మరుసటి రోజు ఉదయానికి విగతజీవిగా మారాడు. అతడి వద్ద పనిచేసే యువకుడు వచ్చి చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే బేకరీకి వెళ్లిపోయిన చింతా సింగ్‌ భర్త మరణవార్త తెలిసి వెంటనే ఇంటికి చేరుకుని రోదించింది.

ఈ ఘటనపై 18వ తేదీన స్థానిక వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి భార్యను, స్థానికులను విచారించారు. ఈ క్రమంలోనే చింతా సింగ్‌కు రాజ్‌కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా 17వ తేదీ రాత్రి గదిలో నిద్రపోతున్న దినేష్‌ను తామిద్దరం కలిసే హత్య చేసినట్లు అంగీకరించారు. తన భర్త కొంతకాలంగా ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నాడని, ఆస్తి తనకు కాకుండా పోతుందన్న భయంతోనే అతడిని చంపినట్లు చింతా సింగ్ విచారణలో వెల్లడించింది.