ఒకప్పుడు విడాకులు అసాధారణమైన విషయం.. కానీ రానురానూ అవి కూడా సర్వసాధారణమైపోయాయి. నచ్చితే కలిసుంటున్నారు, లేదంటే విడిపోతున్నామని సింపుల్గా చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ ధోరణి ఎక్కువైపోయింది. చాలామంది సినీతారల పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలవడం లేదు. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్యలు ఈ కోవలోకే వస్తారు. 18 ఏళ్లు కలిసి జీవించిన వీరిద్దరూ జనవరి 17న విడిపోతున్నట్లు ప్రకటించారు. వారు విడిపోవడాన్ని అభిమానులే కాదు ఐశ్వర్య తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ దంపతులను కలిపేందుకు ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వినికిడి.
కూతురు, అల్లుడు విడిపోదామని నిర్ణయించుకున్నప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. కూతురి జీవితాన్ని చక్కదిద్దాలని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నాడట. వారి మధ్య కలిగిన ఎడబాటు తాత్కాలికమేనని ఆయన బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ధనుష్- ఐశ్వర్య మధ్య తీవ్ర విబేధాలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ వాటిని పరిష్కరించి ఇద్దరినీ కలిపేవాడట. అయితే ఈసారి తీవ్రస్థాయిలో గొడవలు రావడంతో వారిద్దరూ వాటిని పరిష్కరించుకోవడానికి బదులుగా విడిపోవడానికే నిశ్చయించుకోవడంతో రజనీ లోలోనే కుమిలిపోతున్నట్లు సమాచారం.